కవి రాజమూర్తి రెండు వివరణలు – ఎస్. జగన్రెడ్డి జులై 10, 2007
Posted by Telangana Media in Telangana Articles.trackback
అఫ్సర్ కవిరాజమూర్తిపై (11 జూన్, వివి ధ) రాసిన వ్యాసం బాగుంది. ఆలస్యం గానైనా కవిరాజ మూర్తి వెలుగులోకి రావడం తెలంగాణ సాహితీ ప్రియులెవరైనా ఆహ్వానిస్తారు. ఒక కవి రాజమూర్తి విషయంలోనే కాదు, అనేక రచనలు మరుగున పడిపోయాయి. ఆనాటి సాహిత్యకారులు చాలా మంది ఉర్దూకు అపారమైన సేవచేశారు. వారిపై తెలంగాణ సాహి త్యకారులు చూపు సారించేవిధంగా వ్యాసం రాసి నందుకు అఫ్సర్ అభినందనీయుడు. ఆయన వ్యక్తీ కరణలపై ఇంత వివరణ అవసరమా అని ఎవరైనా భావించవచ్చు. తెలంగాణ గతంపై తీవ్రమైన చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ వివరణ అవసరమేనని నేను భావిస్తున్నాను. ఆయన చేసిన రెండు వ్యాఖ్యానాలు మాత్రం ఆనాటి సామాజిక పరిస్థితులపట్ల, సాహిత్యకారులపట్ల అఫ్సర్ అవగాహనపై ప్రశ్నార్థ కంగానే ఉన్నాయి.
మొదటిది కవి రాజమూర్తి భార్య వరలక్ష్మితో మాట్లాడుతూ ‘మూర్తిగారు తెలుగులో బాగా రాయగలిగి ఉండి ఆ నవలని ఉర్దూలోనే ఎందుకు రాశారు?’ అడిగాన్నేను. ఇక రెండోది ఇప్పుడు ముస్లిం భాషగా ముద్రపడిపోయిన ఉర్దూలో ఒక ముస్లిమేతరుడైన రచయిత ఇస్లాంని, నైజాం పాలనలోని ‘ ఇస్లామీకరణ’నీ ఎట్లా అర్థం చేసుకున్నాడని వేరే చర్చ. ఈ రెండు వ్యా ఖ్యానాలపై నా అభిప్రాయాలను పాఠకులతో పంచుకోవాలని భావి స్తున్నాను. ఇస్లామీకరణ అనేది ఇటీవలి రాజకీయ, సాంస్కృతిక భావన. 1978 లో క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే గ్రంథం వెలువడే వరకు ఈ భావన చెలామణిలో లేదు. క్రైస్తవీకరణ, గ్లోబలీకరణ, అమెరీక రణ వంటిది ఆపదబంధం. అమెరికా, యూరోపుదేశాలు అనుస రించే ఈ కార్యాచరణ ఎంతటి బలమైందో తెలిసిన విషయమే.
నిజాం పరిపాలనకు సంబంధించి ఇస్లామీకరణ వంటి పదాలను అఫ్సర్ వాడడం ఆశ్చర్యకరం. ఈ విషయంలో ఆయన వైఖరి హిందూత్వవాదులు ప్రచారంలో పెట్టిన భావాలను నమ్ముతు న్నట్టే ఉంది. కవి రాజమూర్తి నవలను ఉర్దూలో రాయడం పట్ల వింతైన విషయంగా భావించడం మరింత ఆశ్చర్యకరం. అప్పటి తెలంగాణ సాహిత్యకారుల పట్ల కూడా ఆయనకు సరైన వైఖరి లేనట్టుంది. సమకాలీన సమాజంలో భిన్న రాజకీయ, మతవా దులు, నయా హిందూత్వవాదులు చెలామణిలో పెట్టే భావన లను యథాతథంగా ఆయన ఆమోదిస్తున్నట్టుంది.
ఉర్దూ తెలంగాణలో, హైదరాబాదులో పుట్టి ఉత్తరాదికి వెళ్లిం దనేది ఆ భాషా చరిత్రకారులు అంగీకరిస్తున్న విషయం. ఆ భాష ముస్లింలదనే భావన తెలంగాణవాసులకు అప్పట్లో అసలు లేదు (ఇప్పట్లో కూడా). కవి రాజమూర్తి సమకాలీకులు, అంతకుముం దుగల తెలంగాణ సాహిత్యకారులు తెలుగుతోపాటు ఉర్దూ, పర్షి యన్, ఇంగ్లీషు వంటి నాలుగు భాషలలో ఉద్ధండ పండితులు. తెలుగుతోపాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు వరకు కనీసం నాలుగు భాషలు మాట్లాడగలిగే వారు హైదరాబాదు నగరంలో ఇప్పటి వేలాదిమంది ప్రజలు ఉన్నారు.
ముస్లిం విద్యావం తుల కంటే ఉర్దూ భాషకు తెలంగాణ వాళ్లు చేసిన సేవ తక్కువేమీకాదు. 18వ శతాబ్దానికి చెందిన అష్టబాహిరి గోపాల్రావు ఉర్దూలో రచనలు చేసిన మొదటి తెలుగువాడు. రెడ్డి కులానికి చెందిన ఆయన ఎనిమిది భాషలలో మహా పండితుడు. నాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ విషయం చెబుతున్నాను. ఇంకెవరైనా ఉండవచ్చు. ఈయన వనపర్తి పాలకులలో ఒకరు. 1910వ సంవత్సరంలోనే రామాయణంలో కొన్ని ప్రధాన కాండలను ఉర్దూలోకి తర్జుమా చేసింది రాజరాజేశ్వరరావు. ఆయన దోమకొండ సంస్థానా ధీశుడు. రెడ్డి కులానికి చెందిన రాజరాజేశ్వరరావు ఉర్దూ భాషకు 1920లలోనే ప్రామాణి కమైన నిఘంటువు రాశారు.
కథలు, కవిత ఉర్దూలో రాసిన రాజేశ్వరరావు కలంపేరు రాజే శ్వర్ అస్గర్. ఉర్దూ కథా రచనలో ఆయన ప్రేమ్చంద్కు, హైదరాబాద్ నగరానికి చెంది హిందీలో కథలు రాసిన వినాయక్రావు విద్యాలంకర్కు, మాడపాటి హనుమంతరావుకు దాదాపు సమకాలికుడు. అన్ని ఉర్దూ గ్రంథాలయాల్లో రాజేశ్వరరావు రాసిన ఉర్దూ నిఘం టువు ప్రామాణికంగా చెలామణిలో ఉంది. ఉర్దూ భాషను భారతదేశవ్యాప్తంగా 1980 వరకు హిందుస్థానీగా పిలిచేవారు. ఉర్దూ భాషకు ఇంగ్లీషులో మొదట వ్యాకరణం రాసింది వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. ఆయన సరోజినీదేవినాయుడుకు స్వయానా అన్నయ్య. ఆయన 1907లోనే ఈ గ్రంథాన్ని రాశారు. చదువుకోవడానికి లండన్ వెళ్లి అక్కడ ఈ పని తలపెట్టారు.
ఓరియంటల్, కాంటినెంటల్ భాషా శాస్త్రవేత్త అయిన వీరెన్ మాస్కో యూనివర్శిటీలో 1934లోనే ఉర్దూ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించిన వ్యక్తి. మరొక విషయమేమిటంటే రాజేశ్వరరావు రాసిన నిఘంటు వును పట్టిచ్చుకోకుండా నిజాం ఉత్తరాది నుంచి వేలాది రూపాయలిచ్చి నిఘంటు నిర్మా ణానికి పండితులను రప్పిస్తే సురవరం ఆ చర్యను నిరసిస్తూ గోల్కొండ పత్రికలో సంపాదకీయం రాశా రు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన రచన లపై పిహెచ్డి జరిగింది. మాడపాటి హనుమం తరావు, బూర్గుల రామకిషన్రావు, సురవరం ప్రతా ప్రెడ్డి, ఉర్దూ, పర్షియన్ భాషలలో మహా పండి తులు. హైదరాబాద్నగర మాజీ మేయర్ క్రిష్ణస్వామి ముదిరాజ్ తన ఆత్మకథతోపాటు నాలుగు గ్రంథా లను ఉర్దూలో రాశారు.
అందులో ఒకటి హైదరా బాద్ సంస్థాన చరిత్ర. దళితనేతలు భాగ్యరెడ్డివర్మ, అరిగే రామస్వామి ఉర్దూలో రచనలు చేశారని చెప్ప డానికి ఆధారాలు ఉన్నాయి. ఔరంగజేబు కూతురు జెబున్నిసా రాసిన గజల్లకు పర్షియన్ ఉర్దూ సహాయంతో తెలుగు చేసింది సరోజినీదేవి. వీరి రచనలకు ప్రాథమిక స్ఫూర్తి ఉర్దూ పర్షియన్ సాహిత్యమే. తొలిసారిగా ప్రేమ్చంద్ ఉర్దూ కథలను పరిచయం చేసింది మాడ పాటి హనుమంతరావు. కొండా వెంకటరంగారెడ్డి సంప్రదాయ హిందూ- ఇస్లామిక్ న్యాయ శాస్త్రంలో నిష్ణాతుడు. ఆయన ఆ సబ్జెక్టుమీద అనేక గ్రంథాలు రాశారు. వనపర్తి పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసిన అయితరాజు కొండల్రావు ఉర్దూ- తెలుగు, ఇంగ్లీషు నిఘంటువు రాసిన వ్యక్తి. అయితరాజు కొండల్రావు సామల సదాశివకు స్వయాన గురువు. వారి ప్రస్తావన ఆయన ఆత్మకథ ‘యాది’లో కనిపిస్తుంది. అయితరాజు కొండల్రావు ఆనాటి వరంగల్ జిల్లాకు చెందినవారు.
రెండవ తరానికి చెందిన ఉర్దూ పండితులలో పారశీక సాహిత్య చరిత్రను రాసిన కె. గోపాలరావు, దాశరథి సోదరు లు, ముక్తకాల పేరుతో పర్షియన్ రచయితలను పరిచయం చేసిన వల్ల పురెడ్డి, బుచ్చారెడ్డి, శ్రీశ్రీపై మఖ్దూం ప్రభావం ఉందని నిరూపిస్తూ విమర్శ రాసిన ముకురాల రామారెడ్డి, సామల సదాశివ, సినారె ఉర్దూ సాహిత్య సంప్రదాయాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిన మహనీయులు. సినారె పాటలపై, గేయ సాహిత్యంపై ఉర్దూ ప్రతీకల ప్రభావం అపారం. హైదరాబాద్ ఉర్దూ (హిందుస్తానీ సంగీతం) గజల్ సంప్రదాయాన్ని ఆరిపోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న విఠల్రావు, అంతకుముందు శంకరీబాయి, ప్రఖ్యాత హిందీ సంగీతకారుడు మోహన్సైగల్ పేరుతో నిజామా బాద్కు చెందిన ఎల్లయ్య, శంకర్ ఉర్దూకు, హిందీ సంగీతానికి చేసిన సేవ అపారం. లక్నో ఉర్దూకు అక్కడి ముస్లిమేతరులు చేసిన సేవకంటే భాషా సంగీతాలలో తెలంగాణ తెలుగువాళ్లు చేసిన సేవ అపారం, తిరుగులేనిది. ఇంతేకాదు గజల్కు ఉర్దూలో ప్రత్యేక పరిభాష ఉంది.
వాటికి చెందిన అనేక పదాలు తెలంగాణ తెలు గులో సాధారణ స్థాయిలో చెలామణిలో ఉన్నాయి. అదే ఉత్తరాది వాళ్లు వాటిని అర్థం చేసుకోవాలంటే నిఘంటువును సంప్రదిం చవలసిందే. ఇటువంటి గొప్ప పరంపరకు చెందిన కవి రాజమూర్తి ఆయన సమకాలికులైన శ్రీశ్రీ రెండవ తరానికి అంతగా అనామ కులేం కాదు. ఇందుకు దాఖలా 1954లో హైదరాబాద్ నగరం నుంచి వెలువడిన ‘కవిత’ సంచికలు. బాదిలేర్, రింబో, డిలాన్ థామస్ అనువాదాలున్న ఆ సంకలనానికి సంపాదకుడు వరద రాజేశ్వరరావు. కాళోజి, సినారె, దాశరథి, ఉదయరాజు, శేషగిరిరావు, బిరుదు రామరాజు తెలంగాణ నుంచి కవులు గా లబ్దప్రతిష్ఠులైనా కేవలం కవి రాజమూర్తికే అందులో ప్రాతినిధ్యం లభించింది. కారణా లు వేరే.
కాళోజి రామేశ్వర్రావు షాద్ ఉర్దూకు సంబంధించి దేశంలోనే పేరున్న కవి. ఇంతే కాదు, హైదరాబాద్ చిట్టచివరి ప్రధానమంత్రి పింగళి వెంకట్రామారెడ్డి ఉర్దులో రాసిన డైరీ లు అనేకం ఆర్కేవీస్లో ఉన్నాయి. 1946 నుంచి 1956 మధ్యకాలం తెలంగాణకు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి చాలా కల్లోల సంక్షుభితకాలం. ఆ కాలంలో ఆంధ్రప్రాంతీయులకంటే మిన్నగా వైవిధ్యంతో ఎంతో సాహిత్యకృషి చేసిన ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు, ఉదయరాజు శేషగిరిరావు, కాళోజీ నారాయణరావు, పెండ్యాల చినరాఘవరావు, పెండ్యాల శేషగిరిరావు, దేవులపల్లి రామానుజరావు, దాశరథి, బూర్గుల రఘునాథరావు, కేశవస్వామిల సంపెంగతోట వంటి కథలు రాసిన తాళ్లూరి రామానుజస్వామి, తెలుగుతల్లికి సంపాదకత్వం వహించిన రాచమళ్ల సత్యవతీదేవి, చిత్రవిశారద రామకిషన్రావు వంటివారి సాహిత్యకృషి మరుగున పడి పోయింది.
చిత్రమైన విషయమేమిటంటే 1946-1956 మధ్య కాలంలోనే రాజకీయ ఉద్య మంతో ప్రపంచాన్ని ఆకర్షించి కిషన్ చందర్లను హోవార్ట్పాస్ట్, పాబ్లో, నెరూడాలను ప్రభా వితం చేసిన తెలంగాణ రచయితలకు మాత్రం గడ్డుకాలమే. ఈ కాలానికి చెందిన గొప్ప రచయితను ఈ తరం పాఠకులకు పరిచయం చేయడానికి అఫ్సర్ పడ్డ ప్రయాసను అభి నందిస్తూనే గతం నుంచి వర్తమానాన్ని చూడాలని, వర్తమాన రాజకీయ వ్యూహాలతో గతా న్ని విశ్లేషించరాదేమోనని అఫ్సర్కు వినతి.


వ్యాఖ్యలు»
No comments yet — be the first.