ప్రత్యేక తెలంగాణలో నక్సల్స్కూ బాధ్యతలు మార్చి 14, 2008
Posted by Telangana Media in Eenadu.trackback
వారి సామాజిక, ఆర్థిక అజెండాయే మాది కూడా
సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ రాకుంటే విధ్వంసమే
ప్రజాస్వామ్య పద్ధతిలో ఇదే ఆఖరి ప్రయత్నం
తెరాస అధినేత కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లతో తానే చర్చలు జరిపి బాధ్యతలు అప్పగిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సల్స్ సమస్య పెరుగుతోందనే దుష్ప్రచారం జరుగుతోందన్నారు. అసలు నక్సలిజం సమస్యే కాదని, వెనుకబడ్డ తెలంగాణలో వారు తిండి, బట్ట, హక్కుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ద్వారా ఈ సమస్యలు పరిష్కారమై నక్సలిజం మాటే ఉండదని ఉద్ఘాటించారు. నక్సలైట్ల సామాజిక, ఆర్థిక అజెండాయే తమ పార్టీ అజెండా అని చెప్పారు. గురువారం రాత్రి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘పదవులను త్యాగం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభినందన సభ-ధూంధాం’ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ.. నక్సల్స్తో హోం, రెవెన్యూ, సంక్షేమ శాఖల మంత్రులు చర్చలు జరపాలే తప్ప పోలీసులు చర్చలు జరపడం ఏమిటని విమర్శించారు. నీలం సంజీవరెడ్డి దగ్గరి నుంచి రాజశేఖర్రెడ్డి వరకు 50 ఏళ్లలో 20 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నామని చెబుతున్నారని.. కాని వాస్తవానికి అది 20 లక్షల ఎకరాల నుంచి 12 లక్షలకు తగ్గిపోయిందని ఆరోపించారు. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ రాకపోతే ఆందోళన, అలజడి, విధ్వంసాలతో 1969 కన్నా 69 రెట్లు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది ఆఖరి ప్రయత్నమన్నారు. కాంగ్రెస్-తెరాస కల్సి తెదేపాను భూస్థాపితం చేస్తే చంద్రబాబు తెలంగాణకు అడ్డంటూ వీరప్పమొయిలీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. నల్గొండ జిల్లాలో ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన 2లక్షల మంది పిల్లలు ఫ్లోరోసిస్ బారినపడి జీవచ్చవాల్లా బతుకుతున్నారని, వారిని చూస్తే తన గుండె తరుక్కుపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెరాస సిద్ధాంతకర్త జయశంకర్ మాట్లాడుతూ.. వైఎస్ చివరకు బాబాలను తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, రాజీనామా చేసిన తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


సార్వత్రిక ఎన్నికలలో టి.ఆర్.ఎస్ సోది లోకి కూడా లెకుండా పోతే ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు లేదని ఒప్పుకోవాలి గానీ అలజడి విధ్యంసం అంటూ ప్రజల లో భయాందోళనలు సౄష్టించటం ఏ రకం గా సమంజసం నిజంగా టి.ఆర్.ఎస్ కి ప్రజలలో సానుభూతి, అభిమానం లాంటివి ఏవైనా వుంటే అఖండమైన మెజారిటి తో టి.ఆర్ .ఎస్.ని వాళ్ళే గెలిపించితీరుతారు. తెలంగాణా అవిర్భావాన్ని ఎవరూ ఆపలేరు ఇక నైనా కె.సి.ఆర్ నోరు జాగ్రత్త గా చూ సుకోక పోతే అది అంతిమంగా ఉద్యమానికే నష్టం.