jump to navigation

‘తాజా’ సంక్షోభం మార్చి 29, 2008

Posted by Telangana Media in Pranahita.
trackback

 - అల్లం నారాయణ

24edit1.jpgవేలమంది ఏకైక జీవ నాధారమైన సహస్ర వృత్తుల సమస్త జీవన వ్యాపారాలను కూలగొట్టే- నయా, తాజా కుట్రల గుట్టేమిటి ? ఇక ఏమి మిగిలింది? అరకిలో వంకాయలు, పావుకిలో బెండకాయలు, కిలో టమాట, కొంచెం ఉప్పు, కొన్ని మిరపకాయలు, కొంతపప్పు.. తోడుగా ఒక సంచీ, మూడురోజులయినా శీతలం దెబ్బకు వాడిపోని వంకాయ, అద్దాల్లోంచి మెరుస్తున్నది. తళతళలాడే టమాట ఊరిస్తున్నది. పైపూతలు భ్రమింపజేస్తున్నవి.  

అంతా ఫ్రెష్‌ , నిజంగా ఇదంతా తాజానేనా.. కూరగాయల బండీ నెట్టుకుంటూ అరు స్తూ తిరుగుతున్నాడొక అభాగ్యుడు. వీధి మూలమలుపు మీద కూర’గాయాలు’ లెక్కపెట్టుకుంటున్న చిరు వ్యాపారం ఎదగదు, బొదగదు. రెండురెళ్లు రెండే. లెక్క తేలదు, దినం గడవదు, ఫ్రెష్‌ ముందు బారులు తీరుతున్న క్యూలు, వీధి మలుపు కూరగాయల దుకాణం వెలతెల బోతున్నది. కూరగాయలబండి వాడి బతుకు తెల్లారుతున్నది, మరి విముక్తిలేదు. లక్షల మంది నాయీ బ్రాహ్మణులు, లక్షలమంది చర్మకారులు, లక్షలమంది చిల్లర వ్యాపారులు, రంగులద్దిన గంపగుత్త వ్యాపార పదఘట్టనల్లో నీలుగుతున్న సవ్వడి. మారిపోతున్నది, కాలానికి నమస్కారం, గుత్త పెట్టుబడులకు నమస్కారం, సేవల రంగానికి ఆహ్వానం, బాగుంది, ఇండియా షైనింగ్‌. సెన్సెక్స్‌ సూచీలు దాటి విద్యుత్‌ వేగంతో పరిగెడుతున్నది.

నిన్న వెయ్యికోట్లు, నేడు రెండువేలకోట్లు-సంపద పెరిగిపోతూ ఉన్నది. బుల్‌ కుమ్మేస్తున్నది. భారతదేశం మెరుస్తున్నది.అభివృద్ధి సూచీ ఉష్ణోగ్రతలు దాటింది. పాపము శమించుగాక- భారత దేశంలో రోజూ రెండువందల పై చిలుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. బడ్జెట్‌ల వికృత తోకల క్రింద మన్‌మోహన ప్రణాళికల క్రింద, మాంటెక్‌సింగ్‌ మోహాల క్రింద, ఆత్యహత్యల తాలూకు విషాదం విస్తరిస్తున్నది. మద్దతు ధర కోసం వీధిలో లాఠీకి ఎదురేగుతున్నాడు రైతు. పత్తి ధర నిన్నకీ, నేటికీ దిగజారింది. మరి నిష్క­ృతి లేదు. కాలువ నుంచి నెత్తురు ప్రవహిస్తున్నది. అడపాదడపా కొన్నిశవాలు, చిరువ్యాపారి రోడ్డున పడ్డాడు. ఇప్పుడిక కత్తెర్లు, కత్తులు, సానబెట్టడమా ? మిత్తిని కౌగలించుకోవడమా? సంధ్యా సమస్యలో క్షురకుడు. కొన్ని వందల కంప్యూటర్‌ డబ్బాలు, కొన్నివేల చిప్‌లు దాగిన తీగల గుండా సం గీతం ప్రవహిస్తున్నది. అది వెగటు పుట్టి స్తున్నది

. విషాదం మోగవలసిన చోట జల తరంగిణి వాయిస్తున్నదెవరు? గద్దర్‌ పాడుతున్నాడు, కుమ్మరోనింట్ల పుట్టి కుండలేదు, చెంబులేదు, కోమటోళ్లింట్ల పుట్టి బాటులేదు, తరాజులేదు, వృత్తులు అంతరిస్తున్నయి. చేతి వృత్తులా సడుగులిరిగిపాయె.. గోరటెంకన్న జీరగొంతు పరివ్యాప్తమై అలుముకుంటున్నది. వరంగల్‌లో, దిల్‌సుఖ్‌నగర్‌లో ఫ్రెష్‌ల ము«ందు అద్దాల మీదకి రాయి విసురుతున్నాడొకడు. కోటానుకోట్ల మంది, చేతికందిన పనిచేసుకుంటూ బతికే దేశంలో చేతినిండా పనిలేని అర్థ నిరుద్యోగ దేశంలో-గంపగుత్త వ్యాపారాలు తెచ్చే విషపరిణామాలు ఇప్పుడే తెట్టులా తేలుతున్నాయి.సంపదపోగుపడి, ఉన్నోడు ఉన్నతికీ లేనోడు కాటికి… అంతేనా ? ఆ అద్దాల ఫ్రెష్‌మీద ఓరాయి విసిరిన వాడి ముఖం చూడు, అతని ముఖంలో పట్టరాని కోపం ఉంది, అది ఈ అద్దాల మేడలను బద్దలు కొడితే అడ్డుకునేదేముంది. బహుపరాక్‌, మూడోపక్షం, దామాషా అధికారం కోరుతున్న బహుజన మిత్రులారా! ఇంటి గుమ్మంలో నిలబడిన వెయ్యికాళ్ల ఆక్టోపస్‌ గంపగుత్త వ్యాపారం అసలు సమస్య. అది మనని మిగలనివ్వని దురాక్రమణ. ఆలకించండి. 

వ్యాఖ్యలు»

No comments yet — be the first.