jump to navigation

విరోధాభాస మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

- అల్లం నారాయణ

కడుపులో పుట్టెడు జ్వరం-నలభై ఐదు డిగ్రీల ఎండకాస్తున్నట్లు- ‘విస్వూయస్‌’ అగ్నిపర్వతం అంటుకున్నట్టు. జ్వరమాని కొలమానం దాటుతున్నది-నూటా ఆరు డిగ్రీల జ్వరం.మెదడులో పేలుతున్నవి జ్వరమృదంగపు ధ్వనుల ప్రేలాపనలు.


‘అవ్వా’ నేను బతుకుతానా! డాక్టర్‌ లేడా?

దవాఖానా ఎంత దూరం.
అవునూ.. ఆ రహదారి మీద అటు ఏడు కోసులూ, ఇటు ఏడు కోసులూ నరసంచారం లేని దిక్కులేని ఆ అడ్డరోడ్డుమీద చెట్టుకింద కూచున్నది తల్లి. కొడుక్కి వైద్యం కావాలి. మందు గోలీ కావాలి. ఒక వైద్యుడు కావాలి. ఒక ఊరడింపు కావాలి. ఉపశమనం కావా లి. కొడుక్కేమయినా అయితే భరించగలదా! ఆ తల్లి కుంతి కాదు. పిల్లల్ని కనిపారేసి పట్టించుకోజాలని ‘బ్రిట్నీస్పియర్స్‌’ కూడా కాదు కన్న పేగు కదులుతున్నది సశేషం. ఇంతకీ ఆ కొడుకు బతుకుతాడా? జ్వరం వస్తే ఆస్పత్రి ఎంతెంతదూరం!
(ఆదిలాబాద్‌ ఏజెన్సీలో వందలమంది వైద్యం అందక, జ్వరాలతో పిట్టలు రాలినట్టు రాలిపోయారు)
ఏలిక ప్రసంగిస్తున్నాడు. అందరికీ ఆరోగ్యశ్రీ, కడుపునొచ్చినా.. కాలునొచ్చినా.. పుట్టిన ప్రతి మనిషికీ ‘ఆరోగ్యశ్రీ’ ఖజానాలోని ప్రతి పైసా పేదలకోసమే. పేదలకు మాత్రమే ఈ ఖజానాలున్నా యి. సాగుతున్నది ప్రసంగం. జ్వరం రానంతవరకు బాగానే ఉం టుంది. బహుశా ఏలికలకు జ్వరాలు రావు. వచ్చినా ఆస్పత్రులే పరిగెత్తుకొస్తాయి. కనుక ఏలికలకు జ్వరతీవ్రత తెలిసే అవకాశం లేదు. అరవై ఏళ్ల నుంచి ఈ మాటలు ఏలికలనేకమంది మాట్లాడుతూనే ఉన్నారు కానీ….

* * *

చలి.. శీతలం. గడ్డ కట్టుకుపోతున్నడు బిడ్డడు నిండా పదేళ్లు లేవు. కమ్ముకుంటున్నది. కొంకర్లుపోతున్నది శరీరం. ఆచ్ఛాదనల చిరుగులు చలికప్పుకోను వెచ్చనిదేదీలేదు జ్వరం వచ్చినా బాగుండు.. వేడిగానన్నా ఉండు ఇప్పుడేం చేయాలి? అసలే డిసెంబర్‌, ఆరు బయలు నెగళ్ల బతుకునుంచి, అడవి ఎలుగళ్ల బతుకునుంచి చలి మంటల నుంచి చదువుకోసం వచ్చి.. ఈ నరకం లాంటి వసతి గృహంలో చిక్కుకున్నది బాల్యం పొద్దున చారునీళ్లు, మధ్యాహ్నం పురుగుల అన్నం- సాయంకాలం కారపు నీళ్లు. కడుపులో చలికి బిగిసిన ఆకలి గడ్డకట్టింది. కొంచెం ఏడుపు.. సుమ్మర్లు తిరుగుతున్నది. అమ్మ జ్ఞాపకం వస్తున్నది. డొక్కలు ముడుచుకుని, నట్టనడి శీతాకాలం లో ఆ పిల్లల గురించి ఇంకేం చెప్పను. అమ్మకు దూరంగా, అమ్మలాంటి ఇంటికి దూరంగా చలి నెగళ్లకు దూరంగా ఈ దుర్భ రంలో జీవిస్తున్న ఆ పిల్లవాడికి కడుపులోకి కొంత అన్నంకావాలి. తెల్లటి, మెత్తటి, పువ్వులాంటి మెతుకులు కావాలి..కప్పుకోను వెచ్చటి దుప్పటి ఒకటి కావాలి….

దుప్పటి దొరికేనా?

వసతిగృహాల్లో నిద్రిద్దాం… ఆ పిల్లల బాధలను మనమూ అను భవించి పలవరిద్దాం… వసతిగృహాల పిల్లలు మన భావిపౌరులు స్పీకర్‌ ప్రవచించారు. రాజకీయ నేతలు దండుకట్టారు. కొన్ని ఫొటోలు (పిల్లలకి కొంత వినోదం అదీ బహుశా విషాదవినోదం). సరిపోయింది ఉద్ధరణ జరిగిపోయింది. ముఖ్యమంత్రి ప్రతీది పేద ల పరమేనన్న పునరుద్ఘాటన చెవుల్లో మార్మోగుతున్నది. 60 ఏళ్లు గా ఆ వసతిగృహాల్లో పిల్లలకు దుప్పట్లు లేవు. అదంతే.. ఇప్పుడైనా… ఎప్పుడైనా ఆ వసతిగృహాలు అందలం ఎక్కేనా? సందేహమే.
ఉపసంహారం. ఏలికలు పట్టించుకోనివారిని ప్రతిపక్ష నేతలు పట్టించుకుంటారు. ఎన్నికల రుతువులో ఇదో బాధ్యత. వేల దుప్ప ట్లు పంచడానికి ప్రతిపక్షనేత తయార్‌ (పాపం శమించుగాక ఆ తొమ్మిదేళ్లూ వసతిగృహాలు అట్లాగే ఉండిఉంటాయి. అనుమాన మెందుకు?)

* * *

జీడీపీ కొంచెం తగ్గింది. చిదంబరం హెచ్చరిస్తున్నాడు. అయినా అప్రతిహతంగా తొమ్మిది పైబడిన అభివృద్ధిరేటు. ఖరీఫ్‌ బాగుంది. పంటలు బాగా పండుతున్నాయి. జలయజ్ఞం వరదలు వరదలై పారుతున్నది. ఇళ్లుకూడా అదనం. పింఛన్‌ పైస లు తిన్నంత తాగినంత. సెన్సెక్స్‌ ఊర్థ్వముఖంలో హద్దులు దాటి 20000 అయ్యింది. హైదరాబాద్‌లో ఎకరా 14 కోట్లు, గజం లక్షన్నరకు అమ్ముడుపోయింది. కార్పొరేట్‌ కంపెనీలు లాభాలు ప్రకటించాయి. ప్రపంచమే శ్రీమంతంలో మనకు దాసోహమంది. యురోపియన్లు, అమెరికన్లు, టైగర్‌నేషన్స్‌ వాళ్లూ ఒకరనేమిటి? అందరూ భారత్‌ వైపే చూస్తున్నారు. అంతా పెట్టుబడులతో ముం దుకు దూసుకొస్తున్నారు. అంతాబాగుంది. ఇక్కడి నానాజాతి కమ్యూనిస్టులకు, విప్లవకారులకు తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉంది. రాజకీయ పార్టీలకి నూరేళ్ల చరిత్ర ఉంది. సోషలిస్టు కబుర్లకు దశాబ్దాల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళ్లయింది. కొన్ని ప్రణాళికలు గడిచిపోయాయి. భారత్‌ వెలిగిపోతోంది. మీ ఇంట్లపీనిగెల్ల నా కొడుక్కు జ్వరం వచ్చింది ఒక్క మందుగోళన్నా ఇయ్యండయ్యా పాపం శమించుగాక..

వ్యాఖ్యలు»

No comments yet — be the first.