త్రిశంకు స్వర్గం. ఇంకా అయిపోని తాండవం. ఉత్త తాపడాల తో ఏమి ఒరుగుతుంది. ఉత్త పూతలతో ఏ రోగం నయమవుతుందని? అంతం కానిదిది. ఆరంభం కూడా కాదు. చాలా దూరం గడిచి వచ్చిన తర్వాత చేతివృత్తుల చేతులిరగడం గురిం చి కదా…చితి చింత. సిరిసిల్ల గుల్లగుల్లయిపోయి, వాకిళ్ల మొలచిన రాళ్లబండలైపోయిన బతుకుల్ల అగ్గిమల్లే ఎట్లా పుట్టిందో? ఎన్నని చెప్పను. ఏది మొదలు…ఏది కొస. బీసీల గురించిన ప్రవచనాలు పలుకుతున్న మహాత్ములారా! బాబూ! తొంభైమూడు కులాల పేరుపేరునా చదివినందుకు ధన్యవాదాలు. కానీ వాళ్లేం చేస్తారో? ఏమి చేసి బతుకుతారో? వాళ్ల బతుకు ఏ సర్కర్తీగలు తెగిన వీణలయ్యాయో? తెలుసా! పురి తప్పిన దారం ఎక్కడ తెగిపోతుందో? కూలిపోయిన మగ్గా న్ని అడుగు.
మాసిపోయిన బతుకును దారాన్ని అడుగు. నఖాసోడు ఏమి చేస్తడో! నపారోడు ఏమి చేస్తడో? గౌండ్ల ఏమి చేస్త డో? బైండ్ల ఏమి చేస్తడో? ఎవరి సుత్తి ఏ బండమీద రాగాలు పలుకుతుందో? ఎవరి పనిముట్టు ఏ అద్భుతాల గనులు తొలిచి ఏ సంస్కృతులు నిర్మించిందో? ఎవరి స్వేదం ఏ తిండిగింజను మంది నోట్లోకి చేర్చిందో-తెలుసా? నిజమే ఏ చెట్టు లెక్కినవాడు, ఏ గుట్టలెక్కినవాడు, గొర్లు కాసినవాడు, బర్లు గాసినవాడు, పశుపక్ష్యాదులను మచ్చిక చేసుకుని ప్రపంచానికిచ్చినవాడు, తొలి విత్తనం నాటినవాడు, తొలి దుక్కుదున్నినవాడు, తొలి కర్రుని కనిపెట్టినవాడు, బండిగీరెను చేసినవాడు, ఎర్ర ని నిప్పులో ఇనుమును వంచి ఇంధ్ర ధనస్సు లు చేసినవాడు, ఆయుధం అందించినవాడు, ఎందుకిట్లా విస్మృతిలో, ఆత్మహత్యల్లో బతుకు సింగిడీలు ఆరిపోయిన దృశ్యాల్లో అంతమైపోతున్నాడో ఏమైనా తెలుసా! బాబూ!
ఒక గొర్రె పిల్లను భుజం మీద వేసుకున్న వాడా! నువ్వు ఏసు క్రీస్తువు కాగలవా?ఒక గొం గడిని అలంకారంగా ధరించిన వాడా! నువ్వొక గొల్లవాడివి కాగ లవా? ఒక కుమ్మరి సారె తిప్పిన వాడా! అదెన్నడో పురా వస్తు వయిందన్న జ్ఞానం కలదా! ఇప్పుడేమిస్తారని. చేతివృత్తుల సడుగులిరిసినవారెవరు?ఇప్పుడు మలాంపూతల ప్రవచనాలు పలుకుతున్నదెవరు? ఏ మార్కెట్ శక్తులు, ఏ పెట్టు బడిదారీ సామ్రాజ్యాలు ఎవరినడ్డి విరగకొట్టాయో! ఎవరినడిగి లెక్కలు తేల్చాలి.
చంపినవాడు, నష్టపరిహారం చెల్లించిన వాడూ ఒకడే గదా! అతను ఏ కులమైతేనేమి? స్వాతంత్య్రం రాకమునుపే ఏ పత్తి చేలు ఎవరికోసం పుట్టా యి. ఏ నేతగాని ‘మస్లిస్’ గుడ్డ ఎవరి పడకటింట సొగసులు పోయింది. సన్నటి తీగల గుడ్డలు నేసిన ఏ నేతగాడు ఎక్కడ బొంద తవ్వుకున్నాడో? తెలుసా! మహాత్ములారా! పుట్లకొద్దీ జనం కోటొక్క పరిసెగల భారతదేశంల వ్యవసాయమూ, ఆధారిత వృత్తులు అడుగంటిందెన్నడు? ఎవరి కోసం నల్లమందు పూలు పూసినట్టు? సాంప్రదాయ వ్యవసాయ సమాజాలలో చలినీళ్లకు తోడైన వృత్తుల వేడినీళ్లు ఎన్నడావిరైపోయాయి.
ఇప్పుడు బీసీ లకు, దళితులకు చేతుల్దితీసి మూతుల్ల పెట్టడానికి పోటీపడ్తున్న పెద్దలారా? కమ్మరి కొలిమి, సాలెల మగ్గం, చాకలిరేవు, మంగలి గద్దె, వడ్లధాతి, కుమ్మరి సారెలు ఎప్పుడు కూలిపోయినాయో… ఒరంజెక్కిన వాడూ, ఒడ్లు మలిచినవాడూ, భూమిని తలకిందు లుచేసి బువ్వ పంచినవాడూ… సహస్ర వృత్తులు, సమస్త చిహ్నా లు ఏ పెట్టుబడుల, ఏ సామ్రాజ్యాల, లాభనష్టాల ఖాతా పుస్తకా ల్లో కూలిపోయిన మరకలయిపోయిన, మరిచిపోయిన ఆశ్వాసా లైనాయో! తెలుసా? మూలం వెదకమంటున్నా… గాంధీకి జై… ఇప్పుడు కడుపు మాడినోడు.. కాలజ్ఞానం తెలిసినవాడు… రాకాసి బల్లిలా మింగు తున్న సమస్త జాతుల శత్రువు, సమస్త వృత్తుల శత్రువు, సమస్త మానవాళిశత్రువు మార్కెట్ మహమ్మారికి మూలధాతువులిచ్చిన పెట్టుబడి సామ్రాజ్యాలు కాదా!
లాభాల మైమరపులో మానవ జాతి సహస్ర సృజననూ చేవగార్చిన మహాసామ్రాజ్యాలు కాదా! మీరంతా అబ్బురపడుతూ, ఆకాశంకేసిచూస్తూ, నేలవిడిచి గాలి లో తేలుతూ… కంప్యూటర్ డబ్బాల గురించి డబ్బాలు కొడ్తున్న వాళ్లుకాదా! జీవంలేని సేవల్లో జీవాన్ని, మనిషి జీవనాన్ని, వేద నను చంపినవాళ్లు కాదా? ఇక కులవృత్తులు ఎక్కడ?చేతివృత్తులు ఎక్కడ, చెట్టెక్కేవాడె క్కడ? బతుకును చేదేవాడెక్కడ… మిస్టర్ క్లింటన్ తొత్తులు, మిస్టర్ బుష్ తొత్తులకు, అమెరికాలు, లండన్లు, జర్మనీ లు, జపాన్లు ఆదర్శాలయినవాళ్లకు… యూరోప్ డాలర్కు, అమెరికా డాలర్కు, దాసోహమంటున్న వాళ్లు… ఇప్పుడిక సహస్ర వృత్తుల, సమస్త చిహ్నాల ప్రతినిధులకు ఏమి వ్వగలరు. మళ్లీ గాంధీకి జై… ఆయన గ్రామ స్వరా జ్యం గురించి మాట్లాడారు. అవును నిజమే ఒకగ్రామం ఒక యూనిట్గా ఎట్లా స్వయం గా బతుకగలదో? వ్యవసాయం, చేతివృత్తి, కులవృత్తి ఎట్లా మమేకమై బతుకుతాయో అతనే చెప్పాడు.
అంబేద్కర్కీ జై! వ్యవసాయం, ఇతర వృత్తులు, దళితులూ, బీసీ లు, వారి మూలాలు, వారి జీవనాల అసలు స్వరూపం విడ మర్చి చెప్పాడు. కానీ…. స్వాతంత్య్రం వచ్చినదాదిగా ఒక పద్ధతి ప్రకారంగా గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపి, గాంధీ బోధ నలు తుంగలో తొక్కి, అమెరికాలకూ, అగ్రరాజ్యాలకూ దాసోహ మైన వారికి ఈ వృత్తుల మీద బతికే బీసీలు, దళితుల గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? కంప్యూటర్లూ .. కఠిన జీవితాలూ ఒకే చట్రంలో ఇమడగలవా? ఎన్నడన్నా కులసమాజం ఒకటి ఉందని, ఈ కుల సమాజాలే భారతదేశంలో వర్గాల అంతరాల దొంతరలు సృష్టించాయని ఎవ రైనా గుర్తించారా?
కుల వృత్తులను, ఎస్సీలను, బీసీలను గుర్తించే దెవరు? వారి సంఖ్యఎంత, వారికి సంపద ఎంత? వారికి ఒక రిచ్చేదేమిటి? వారుపుచ్చుకునేదేమిటి? దామాషా పద్ధతిలో రాజ కీయాధికారం పంచగలరా! ఇన్నెందుకు ముఖ్యమంత్రీ, మాజీ ముఖ్యమంత్రీ! 70 శాతంగా ఉన్న దళితులకూ, బీసీలకూ అధికారం పంచి ఇవ్వగలరా? సృష్టికర్తలకు ఎందుకీ బిచ్చాలు, ఎందుకీ వరాలు. ఎందుకీ ఆశలు, బాసలు.. వాళ్ల ప్రపంచం ఎప్పుడో కూలిపోయింది. ఇక జరగాల్సింది పునర్నిర్మాణమే.
వ్యాఖ్యలు»
No comments yet — be the first.